ఆంధ్ర ఎయిర్ పోర్ట్ లకు కొత్తకళ
హైదరాబాద్ః ఆంధ్రప్రేదేశ్ లోని ఐదు ఎయిర్ పోర్టులను 1.6 బిలియన్ రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు ఎయిర్ పోర్ట్స్ అధారిటీ గురువారం ప్రకటించింది. హైదరాబాద్,విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి ఎయిర్ పోర్టులను ఈ నిధులతో అభివృద్ధి చేయనున్నట్లు ఎయిర్ పోర్ట్స్ అధారిటీ ప్లానింగ్ అండ్ ఇంజనీరింగ్ కమిటీ సభ్యుడుకె. రామలింగం ప్రకటించారు.
అంతర్జాతీయ విమానాశ్రయ హోదా పొందిన హైదరాబాద్ లోని బేగంపేటవిమానశ్రయం ఆధునీకరణ పనులు ఏడాదిలోగా పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారువిమానాశ్రయాన్ని 50 కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయవిమానాశ్రయ హోదా వున్నప్పటికీ ఏ-300 విమానాలు ఇక్కడ ల్యాండింగ్ అయ్యేందుకు వసతి లేదు.
బేగంపేట విమానాశ్రయం రన్ వే 9 వేల అడుగులు మాత్రమే వున్నందున బోయింగ్ వంటిపెద్ద విమానాలు ల్యాండింగ్ అయ్యే అవకాశాలు లేవు. ఆ కారణంగా రన్ వే సామర్ధ్యాన్ని 10,500 అడుగులకుపెంచనున్నట్లు అధికారులు గురువారం వెల్లడించారు. ఈ చర్యవల్ల పలు అంతర్జాతీయవిమానాలు కూడా ఇక్కడ ల్యాండ్ అయ్యేందుకు వీలుకలుగుతుందని వారు చెప్పారు. బేగంపేట విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ ఏటా 15 శాతం పెరుగుతున్నదని ఆయన చెప్పారు. రన్ వే ను పొడిగించడంతో పాటు విమానాశ్రయంలో వసతులను కూడా పెంచనున్నట్లు అధికారులు వివరించారు.
విశాఖపట్నంలో కొత్తగా పదివేల అడుగుల రన్ వే నిర్మాణంతో పాటు పలు వసతులు కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. రన్ వే ను విస్తరించడం వల్ల ఎబి.300, బి.767 స్థాయి విమానాలు ఇక్కడ ల్యాండ్ అయ్యేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు.
ఇకపోతే తిరుపతిలో రాత్రిపూట విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అవసరమైన వసతులు కల్పిస్తామన్నారు. తిరుపతితో పాటు విజయవాడ రన్ వే ను కూడా విస్తరించనున్నట్లు ఆయన చెప్పారు. ఓ.ఎన్.జి.సి. ఎయిర్ క్రాఫ్ట్ లు ల్యాండ్ అయ్యేందుకు వీలుగా రాజమండ్రి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసినట్లు ఆయన చెప్పారు. రాజమండ్రి రన్ వే ఆధునీకరణకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి శరద్ యాదవ్ శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు.