ెనపాల్ ఊచకోతలో ఐఎస్ఐ హస్తం
ముంబాయి: నేపాల్ రాజప్రాసాదంలో జరిగిన ఊచకోతల్లో పాకిస్తాన్ ఉగ్రవాదుల హస్తం వున్నదనీ, ఈ మారణకాండ ఐఎస్ఐ కుట్ర కారణంగా జరిగిందని శివసేన అధినేత బాల్థాకరే సంచలన ప్రకటన చేశారు.
నేపాల్ రాచకుటుంబాన్ని సమూలంగా తుడిచిపెట్టిన ఆ కాళరాత్రి కేవలం రాచకుటుంబికులు మాత్రమే మరణించలేదని మొత్తం 120 మందిని పాక్ ప్రేరేపిత ముష్కరులు బలితీసుకున్నారని థాకరే తమ పార్టీ అధికార పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. నేపాల్తో పాటు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ రాజమహల్ హత్యలపై థాకరే ప్రకటన సరికొత్త దుమారానికి తెరలేపే అవకాశం వుంది.
నారాయణహితి రాజప్రాసాదంలో శుక్రవారం రాత్రి జరిగిన విందులో పాల్గొన్నవారిపైకి ఐఎస్ఐ ఎజెంట్లు, ఉగ్రవాదులు విచక్షణరహితంగా బుల్లెట్ల వర్షం కురిపించారని ఆయన పేర్కొన్నారు. ఈ ఊచకోతలకు యువరాజు దీపేంద్ర బాధ్యుడంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. దీపేంద్ర వీపులో కూడా బుల్లెట్ గాయాలు వున్నాయని తమకు విశ్వసనీయంగా తెలిసిందని ఆయన ఆన్నారు.
నేపాల్లో ఐఎస్ఐ కార్యకలాపాల జోరుకు హతిక్ రోషన్, ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాకింగ్కు మించిన నిదర్శనాలు ఏం కావాలని కూడా ఆయన ప్రశ్నించారు. మరణించిన నేపాల్ రాజదంపతులకు నివాళులర్పిస్తూ, భారత్-నేపాల్ మధ్య వున్న చిరకాల స్నేహసంబంధాల దృష్ట్యా ఐఎస్ఐ కార్యకలాపాలకు పగ్గం వేసేందుకు అవసరమైతే భారత్ సైనిక సాయం అందజేయాలని ఆయన అన్నారు.