చేపమందుకు ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్: అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్ చేపమందు పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది చేపమందు కోసం ఏడు లక్షల మంది వరకు వచ్చే అవకాశం వుందని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో ఆస్తమా రోగులు మూడు లక్షల మందికిపైగా వుండవచ్చని వారితో కూడా వచ్చే వారు మరో మూడునాలుగు లక్షల మంది వుంటారని భావిస్తున్నారు.
రోగులకు ఉచితంగా మందును అందజేసే బత్తిన గౌడ్ సోదరులు కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రభుత్వ పరంగా జరిగిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. మందుకు అవసరమైన కొర్రమీను చేపపిల్లల విక్రయానికి 42 కౌంటర్లను ఏర్పాటు చేశారు. వీటిలో మహిళలకు, విఐపిలకు, మిలటరీ సిబ్బందికి కొన్ని కౌంటర్లను ప్రత్యేకించారు. దేశ, విదేశాలనుంచి వచ్చే సందర్శకుల భద్రతను దృష్టిలో వుంచుకుని 800 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
మందుపంపిణీ శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఏకబిగిన 24 గంటలపాటు మందుపంపిణీ కొనసాగుతుంది. మొత్తం 32 కౌంటర్ల ద్వారా మందుపంపిణీ చేస్తారని బత్తిన హరినాథ్గౌడ్ చెప్పారు.
ఇదిలా వుండగా చేపమందు కోసం తరలివచ్చిన వారితో జంటనగరాల్లోని హోటళ్లు, లాడ్జీలు కిటకిటలాడుతున్నాయి. జంటనగరాల్లో బంధుమిత్రులు లేనివారంతా హోటళ్లలో బస చేస్తున్నారు. కాగా మధ్యతరగతి, దిగువమధ్యతరగతి ప్రజలకు అందుబాటులో వున్న లాడ్జింగ్లు , వసతిగృహాలు నిండిపోవడంతో చాలామంది ప్రజలు మందుపంపిణీ చేసే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోనే ఈ పూట గడపాలన్న ఉద్దేశ్యంతో గ్రౌండ్స్కు చేరుకుంటున్నారు. వారిని పోలీసులు లోపలికి అనుమంతిచడం లేదు. చేపమందు పంపిణీరోజున ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వసతికోసం కూడా ఏమైనా ఏర్పాట్లు చేస్తే బాగుండేదని యుపి, ఢిల్లీ వంటి దూరప్రాంతాలనుంచి వచ్చిన వారు అంటున్నారు.