విజయవంతంగా ప్రధానికి శస్త్రచికిత్స
ముంబాయి: ప్రధాని వాజ్పేయి కుడిమోకాలుకు గురువారం నాడు బ్రీచ్కాండీ ఆస్పత్రిలో విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తయింది. అంతర్జాతీయ ప్రసిద్ధి చెందిన అమెరికా భారతీయ డాక్టర్ చిత్తరంజన్ రణావత్ ఉదయం 10 గంటలకల్లా ఆపరేషన్ పూర్తి చేశారు.
బుధవారం నాడే ఆస్పత్రిలో అడ్మిటైన వాజ్పేయిని గురువారం ఉదయం 8.45 గంటలకు ఆపరేషన్ థియేటర్లోకితీసుకువెళ్లారు. గంటలో ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేసి రణావత్ బయటకు వచ్చారు. గురువారం సాయంత్రం ఆపరేషన్కు సంబంధించిన వివరాలపై సహ్యాద్రి గెస్ట్హౌస్లో విలేకరుల సమావేశంలో డాక్టర్ రణావత్ మాట్లాడుతారు.
వాజ్పేయి ఆపరేషన్ థియేటర్లో వున్న సమయంలో ఆయన పెంపుడు కుమార్తె ఆల్లుడు వారి పిల్లలతో పాటు హోం మంత్రి ఎల్కె అద్వానీ కూడా థియేటర్ బయటవేచి వున్నారు. ఆపరేషన్ జరిగినంతసేపు ఆయన మెలుకువగానే వున్నారని, ఆపరేషన్ కోసం డాక్టర్లు లోకల్ అనెస్థిషియా ఉపయోగించారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కొద్ది నెలల క్రితం డాక్టర్ చిత్తరంజన్ రణావత్ ప్రధాని ఎడమమోకాలికి కూడా ఆపరేషన్ చేసిన విషయం విదితమే. ఆపరేషన్ తర్వాత వారం రోజుల్లోనే ప్రధాని మామూలుగా నడిచేట్టుగా ఆయన చేయగలిగారు.