ఎన్కౌంటర్లలో ఏడుగురు నక్సల్స్ హతం
హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో శనివారం ఏడుగురు నక్సల్స్ హతమయ్యారు. పోలీసులకు, నక్సలైట్లుకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లలో వరంగల్ జిల్లాలో ఇద్దరు మరణించగా, నల్లగొండ జిల్లాలో ఐదుగురు మరణించారు.
నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం దేవరపల్లిలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లోఐదుగురు నక్సల్స్ మరణించారు. నక్సలైట్లు ఒక ఇంటిలో తలదాచుకున్నారని సమాచారంఅందడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఐదుగురు నక్సలైట్లు మరణించారు. మరణించినవారిలో ఒక మహిళా నక్సలైట్ కూడా వుంది. మరణించిన నక్సలైట్లను నిషిద్ధపీపుల్స్వార్ గ్రూప్నకు చెందిన కనగల్ దళ సభ్యులుగా పోలీసులు గుర్తించారు.
వరంగల్ జిల్లా గోవిందరావు పేట మండలం పసర పోలీసు స్టేషన్ పరిధిలోని సోమాల గడ్డ అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు నక్సల్స్ హతమయ్యారు. హతమైననక్సలైట్లను సిపియుఎస్ఐ (వీరన్న వర్గం) నక్సలైట్లుగా పోలీసులు గుర్తించారు.
పోలీసుల కథనం ప్రకారం- నక్సలైట్ల ఉనికి గురించి తమకు అందిన సమాచారం మేరకు ఎస్ఐ నర్సయ్య ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ గాలింపు సందర్భంగా ఎనిమిది మందితో కూడిన నక్సలైట్ దళం ఎదురు పడింది. పోలీసులను చూడగానే నక్సలైట్లు కాల్పులు ప్రారంభించారు. పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లు మరణించారు. సంఘటనా స్థలానికి ఎఎస్పి విక్రమ్సింగ్, ఒఎస్డి నాగిరెడ్డి, సిఐ కె. ఆర్. నాగరాజు వెళ్లారు.