జీవో 610పై అఖిలపక్షం
హైదరాబాద్: తెలంగాణా ప్రాంతంలో ఉద్యోగాలు చేస్తున్న స్థానికేతరులకు సంబంధించిన జీవో 610పై త్వరలోనే తాము అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం నాడు చెప్పారు. ఈ జీవోపై తగినంత అవగాహన లేకుండానే వివిధ పార్టీలు ప్రకటన చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఈ జీవో అమలు ఎంతవరకు జరిగింది, ఎక్కడ ఆగిపోయింది వంటి విషయాలపై తాము సమాచార సేకరణ జరుపుతున్నామని ఆయన చెప్పారు.
తమకు కూడా ఈ జీవోకు సంబంధించిన విషయాలపై అవగాహన లేదని ఆయన చెప్పారు. అఖిల పక్ష సమావేశంఏర్పాటు చేయడంతో తెలంగాణా ఉద్యోగ సంఘాల అభిప్రాయసేకరణ కూడా ప్రభుత్వం చేస్తుందని ఆయన వెల్లడించారు.అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్ వేర్పాటు వాద పాట పాడుతున్నదని ఆయన చెప్పారు. అధికారంలో వున్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు మరో మాట మాట్లాడటం కాంగ్రెస్కు అలవాటేనని ఆయన దుయ్యబట్టారు.
గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నప్పుడు రాయలసీమ ఉద్యమాన్ని నడిపిన కాంగ్రెస్ నేతలు వారి పార్టీ అధికారంలోకి వచ్చిన ఆ విషయాన్ని పక్కనబెట్టారని ముఖ్యమంత్రి చెప్పారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను ప్రజల్లోకి వెళ్లి వివరించడానికి సిద్ధంగా వున్నామని ఆయన చెప్పారు.