వేర్పాటువాదం ప్రభుత్వాల పుణ్యమే
హైదరాబాద్: తెలంగాణాలోని ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే 610 జివో అమలులో నిర్లక్ష్యమే వేర్పాటువాద ధోరణులకు కారణమని ప్రతిపక్షాలు విమర్శించాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో ప్రతిపక్షాలు ఈ విమర్శ చేశాయి. 610 జివో అమలుపై రాష్ట్ర ప్రభుత్వాలేవీ శ్రద్ధ చూపలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు విమర్శించారు.
ఉత్తర్వులు విడుదలై దశాబ్దాలు గడిచినా అమలు చేయకపోవడం దారుణమని ఆయన అన్నారు. ఈ ఉత్తర్వు 1985లో జారీ అయిందని, ఆ తర్వాత కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చిందని, అటు కాంగ్రెస్ గానీ, ఇటు తెలుగుదేశం గానీ అధికారాల్లో వున్నప్పుడు ఈ ఉత్తర్వు అమలు పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించలేదని, ఈ కారణంగా వేర్పాటువాద ధోరణి ప్రబలుతోందని ఆయన అన్నారు. జీవో అమలులో లోపాలను సరిదిద్దాల్సిన అవసరం వున్నదని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో బి.వి. రాఘవులుతో పాటు వి. పురుషోత్తమరెడ్డి, డాక్టర్ కె. కేశవరావు (కాంగ్రెస్), డాక్టర్ కె. లక్ష్మణ్ (బిజెపి), అసదుద్దీన్ ఓవైసీ (మజ్లీస్), రావుల చంద్రశేఖరరెడ్డి, లాల్ జాన్ బాష (టిడిపి), తదితరులు పాల్గొన్నారు.