దేశంతో పొత్తుకు బిజెపి తయారు
విశాఖపట్నం; త్వరలో జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలని బిజెపి రాష్ట్ర శాఖ నిర్ణయించింది. శనివారం నుంచి ప్రారంభమవుతున్న రాష్ట్ర బిజెపి కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో శుక్రవారం నాడు బిజెపి పదాధికారుల సమావేశం జరిగింది. విశాఖ స్టీల్ప్లాంట్లో జరిగిన ఈ సమావేశంలో కార్యవర్గ సమావేశానికి సంబంధించిన ఎజెండాను ఖరారు చేశారు.
కార్యవర్గ సమావేశంలో ఆమోదించే తీర్మానాలు ముసాయిదాలను పదాధికారుల సమావేశం ఖరారు చేసింది. పంచాయతీ ఎన్నికల వ్యూహం పై సమావేశం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. పదాధికారుల సమావేశం ధోరణి చూస్తే తెలంగాణా ఊసు కార్యవర్గ సమావేశంలో వచ్చేట్టుగా కనిపించడం లేదు.
అయితే మెదక్ ఎంపీ నరేంద్ర మరికొందరు తెలంగాణా నేతలు ఈ సమావేశాలకు హాజరైన కారణంగా సమావేశాలకు ఎదో ఒక దశలో తెలంగాణా వేడి తగలడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణాపై పార్టీ వైఖరిని పార్టీ జాతీయ అధ్యక్షుడు జనాకృష్ణమూర్తి ఇదివరకే స్పష్టం చేసినందున తాము ప్రత్యేకంగా మాట్లాడాల్సింది ఏదీ లేదని బిజెపి రాష్ట్ర నాయకులు చెప్పారు. గోదావరి ఎత్తిపోతల పథకం సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి కోరారు. గోదావరి నదీజలాల వినియోగానికి అదే సమయంలో ఉత్తరకోస్తా జిల్లాల కోసం పోలవరం ప్రాజెక్టును వీలున్నంత తొందరగా పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.