బంగ్లాలో బాంబుపేలి 22 మంది దుర్మరణం
ఢాకా:బంగ్లాదేశ్లో అధికార అవామిలీగ్ పార్టీ నిర్వహిస్తున్న సదస్సులో బాంబుపేలి 22 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది. నారాయణ్గంజ్లోని అవామిలీగ్ కార్యాలయంలో పార్టీ సిద్ధాంతవేత్త, సీనియర్ పార్లమెంట్ నాయకుడు షమీమ్ ఉస్మాన్ అధ్యక్షతన స్థానిక నేతల సమావేశం జరుగుతుండగా ఈ బాంబు పేలింది.
తీవ్రంగా గాయపడిన షమీమ్ను ఢాకా ఆస్పత్రికి తరలించారు. బాంబు పేలిన సమయంలో సమావేశంలో సుమారు 400 మంది వున్నట్టుగా పోలీసులు చెప్పారు. 12 మంది అక్కడికక్కడే మరణించారు. గత రెండేళ్లుగా బంగ్లాదేశ్ను కల్లోల పరుస్తున్న వరుస బాంబు పేలుళ్లలో ఇది తాజా సంఘటన
గోపాల్గంజ్లోని కాథలిక్ చర్చిలో పదిహేను రోజుల కింద జరిగిన బాంబు పేలుడులో 10 మంది మరణించిన సంఘటననుంచి బంగ్లా ప్రజలు తేరుకొనకముందే మరో బాంబుపేలుడు జరగడంతో భద్రతావ్యవస్థపై తీవ్రస్థాయిలో విమర్శలు తలెత్తుతున్నాయి. తాజా సంఘటనతో ఢాకా దానిచుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారని పరిశీలకులు అంటున్నారు. శనివారం రాత్రి బాంబు పేలుడులో మృతుల సంఖ్య ఇంకాపెరిగే అవకాశం వుంది.