ఎల్లంపల్లి ఎత్తిపోతలకు బిజెపి వినతి
హైదారాబాద్; గోదావరి జలాల సద్వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన చర్యల పట్ల బిజెపి హర్షం వ్యక్తం చేసింది. దేవాదుల వద్ద గోదావరి నదిపై ఎత్తిపోతలకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే శంకుస్థాపన జరిగినప్పటికీ ఇంతవరకు ఎవరూ పట్టించుకోకుండా వున్న ఎల్లంపల్లి ఎత్తిపోతల ప్రాజెక్టును కూడా ప్రారంభించాలని బిజెపి నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి విద్యాసాగర్రావు కోరారు.
గోదావరి నదీజలాల వినియోగానికి ఎత్తిపోతలను మించిన మార్గం లేదనిఆయన అన్నారు. ఎల్లంపల్లితో పాటు దొమ్మగూడెం పథకాలను కూడా ప్రభుత్వం ప్రారంభించాలని ఆయన కోరారు. డ్వాక్రా మహిళ ఉత్పత్తుల ఒకటి రెండు సంవత్సరాల్లో అంతర్జాతీయ మార్కెట్ను అందుకునే అవకాశం వున్నదని ఆయన చెప్పారు. గోదావరి జలాల వినియోగం, మహిళ చైతన్యం ఈ రెండు అంశాలే రానున్న రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేయనున్న కీలక అంశాలు కాగలవని విద్యాసాగర్రావు చెప్పారు.
ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకాన్ని చేపడితే కనీసం 53 టిఎంసిల జలాలను తక్షణమే వినియోగంలోకి తెచ్చుకోవచ్చని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కనీసం 10 టిఎంసిల నీరు అవసరమున్న ఎన్టిపిసి సంస్థ ప్రాజెక్టు వ్యయంలో కొంత భరించడానికి సిద్ధంగా వున్నదని విద్యాసాగర్రావు అన్నారు. ఎన్టిపిసితో జాయింట్వెంచర్లో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టవచ్చని ఆయన సూచించారు.