ఎన్డిఎ ప్రభుత్వం అవినీతి నిలయం
హైదరాబాద్: ఎన్డిఎ ప్రభుత్వం అవినీతిలో పీకలదాకా కూరుకుపోయిందని ప్రభుత్వం అవినీతి వల్ల దేశం అథోగతి పాలవుతున్నదని కాంగ్రెస్ తీవ్రంగా దుయ్యబట్టింది. ఎన్డిఎ అవనీతిపై పెద్దఎత్తున ప్రజలను జాగృతం చేయాలని కాంగ్రెస్ పార్టీ తన కార్యకర్తలకు పిలుపునిచ్చింది.
హైదరాబాద్లో ఏర్పాటు చేసిన దక్షిణాది రాష్ట్రాల రాజకీయ శిక్షణాశిబిరంలో పార్టీ సీనియర్ నేత, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి మణిశంకర్ అయ్యర్ ప్రసంగించారు. తహల్కా, టెలీకామ్ కుంభకోణాలను ప్రధాన ప్రచార అస్త్రాలుగా చేసుకుని ఎన్డిఎ అవినీతిపై వీధివీధినా ప్రచారం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలను ఆయన కోరారు. స్వతంత్ర భారత చరిత్రలో ఇంత అవినీతికరమైన ప్రభుత్వాన్ని ప్రజలు చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు.టెలీకామ్లో ఒక కుంభకోణం కాదని అనేక కుంభకోణాలు వున్నాయని మణిశంకర్ అన్నారు.
పెట్టుబడుల ఉపసంహరణలో, విదేశీ పెట్టుబడుల అనుమతిలో అనేక కుంభకోణాలు వున్నాయని ఆయన ఆరోపిచారు. ఎన్డిఎ ప్రభుత్వ విధానాలే ఈ అవినీతికి ఊతం ఇస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఎన్డిఎలో వేళ్లూనుకుపోయిన అవినీతిని ఎండగట్టకపోతే దేశ భవిష్యత్తు అంధకారం కాగలదని ఆయన హెచ్చరించారు. మాజీ స్పీకర్ శివరాజ్ పాటిల్ ప్రసంగిస్తూ, రక్షణ వ్యవహారాలు, ఆర్ధిక వ్యవహారాలు, విదేశాంగ విధానాల్లో ఎన్డిఎ ప్రమాదకరమైన విధానాలను అవలంభిస్తున్నదని పేర్కొన్నారు. ఈ శిక్షణ శిబిరం రెండు రోజుల పాటు కొనసాగుతుంది.