ముషరాఫ్ కోసం హవేలీ ముస్తాబు
న్యూఢిల్లీ : నిన్నటివరకూ ఇరుకు సందులతో, చెత్తాచెదారం నిండి అపరిశుభ్రంగా ఉండిన ఢిల్లీ నెహర్వాలీ హవేలీ ఇప్పుడు కొత్త అందాలను సంతరించుకుంది. హవేలీ రూపురేఖలు ఉన్నట్టుండి మారిపోయేందుకు కారణం పాక్ అధ్యక్షుడు ముషరాఫ్ ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుండటమే. ముషరాఫ్ జన్మస్ధలమైన హవేలీని తన భారత పర్యటనలో భాగంగా సందర్శించాలని భావించటంతో ఒక్కసారిగా ఈ ప్రాంతం వార్తలలో కెక్కింది.
తమ ఘనమైన అతిధికి మరపురాని స్వాగతం పలికేందుకు ఈ ప్రాంత నాయకులు హవేలీ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పొంగిపొరలే మురికి కాలువలు, గతులకుల రోడ్లు, వేలగని వీధిదీపాలు.... ఇవన్నీ ఇప్పుడు మాయమై పోయాయి. ముషరాఫ్ కుటుంబం 1947 దేశవిభజనలో పాకిస్తాన్కు వెళ్లక ముందు ఇక్కడే నివాస ముండేది. ముషరాఫ్ కూడా ఇక్కడే జన్మించారు. భారత ప్రభుత్వంతో శాంతి చర్చల సందర్భంగా జూన్ 14-16 తేదీలలో జరుపుతున్న భారత పర్యటనలో తాను పుట్టిపెరిగిన ఇంటిని ఇన్నేళ్ల తరువాత ఆయన సందర్శించనున్నారు.
ముషరాఫ్ను తన జన్మస్ధలానికి ఆహ్వానించాల్సిందిగా తాము విదేశాంగ శాఖను కోరామని స్ధానిక ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్ తెలిపారు.తాము ముషరాఫ్ను ఆయన జన్మస్ధలానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని, అయితే భద్రతా చర్యలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉందని విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ బదులిచ్చినట్టు ఇక్బాల్ తెలిపారు.
మేము ముషరాఫ్కు ఒకప్పుడు ఆయన తన బాల్యాన్నిగడిపిన ఇళ్లను చూపాలనుకుంటున్నాము. ఇది ఆయనకు మరపురాని అనుభూతిని, మాకు అత్యంత గౌరవాన్ని మిగిలిస్తుంది అని ఆయన అన్నారు. ముషరాఫ్ రాక సందర్భంగా ఈ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు తన ఎమ్మెల్యే నిధులనుంచి 1.2 మిలిమయన్లను కేటాయించినట్టు ఇక్బాల్ చెప్పారు.
ముషరాఫ్ రాక సందర్భంగా ఉర్దూ కవిసమ్మేళనాన్ని కూడా తాము ఏర్పాటు చేయదలచినట్టు ఆయన తెలిపారు. అలాగే, ఇండో-పాక్ ఉర్దూ అకాడమీని కూడా ముషరాఫ్ చేతులమీదుగా ఈసందర్భంగా ప్రారంభింప చేయాలని భావిస్తున్నట్టు ఇక్బాల్ తెలిపారు. అతిధులకు అద్భుత ఆతిధ్యాన్ని అందించే భారతీయ సంస్కృతిని ఈ సందర్భంగా ముషరాఫ్ కు మేము రుచిచూపాలనుకుంటున్నామని ఇక్బాల్ పేర్కొన్నారు. కాగా, ముషరాఫ్కు తనదైన రీతిలో స్వాగతం పలకాలని ఈ ప్రాంత బిజెపి ఎంపి విజయ్ గోయల్ కూడా సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.