భారత్ లో మెడికల్ గ్రాంట్స్ కమిషన్
హైదరాబాద్ః భారత దేశంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తరహాలో మెడికల్ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు చేయున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సి.పి. ఠాకూరు ప్రకటించారు. నిరుపేదలకు సైతం అధునాతన వైద్య సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు చేపడుతున్నదని ఆయన చెప్పారు.
మలేరియా, క్యాన్సర్, ఎయిడ్స్ వంటి వ్యాధులపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్ లోని యశోదా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సందర్శించారు. ప్రైవేట్ రంగంలోని ఆస్పత్రులు అన్ని రకాల వైద్య సౌకర్యాలను కలిగివుండడం హర్షణీయమని ఆయన అన్నారు.
మలేరియా, ఎయిడ్స్, క్యాన్సర్ వంటి వ్యాధులపై అవగాహన కలిగించేందుకు దేశంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఠాకూర్ ఈ సందర్భంగా చెప్పారు. దేశంలోని మెడికల్ కళాశాలలో యు.జి.సి. తరహాలో ఒక గ్రాంట్స్ కమిషన్ ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ఆయన వివరించారు.
ఢిల్లీలో వున్న అతిపెద్ద మెడికల్ లైబ్రరీని ఇంటర్నెట్ కు అనుసంధానం చేయడం ద్వారా దానిని అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఠాకూర్ వెల్లడించారు.