సాధువుల నుంచి సాఫ్ట్వేర్కు....
న్యూయార్క్: ఐటి విప్లవం దరిమిలా భారత్ పట్ల అంతవరకు ప్రపంచదేశాల్లో వున్న ఇమేజ్ సమూలంగా మారిపోయిందని భారత్కు చెందిన ఐటి నిపుణులు, కేంద్ర ఐటి మంత్రి ప్రమోద్ మహాజన్ అంటున్నారు. అమెరికాలో ఇండియన్ ఐటి పరిశ్రమను ప్రమోట్ చేసేందుకు వీలుగా సోర్స్ ఇండియా 2001 పేరుతో నిర్వహిస్తున్న రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. భారత్ అనగానే పశ్చమ దేశాల్లో గతంలో దిగంబర సన్యాసులు సంచరించే దేశమని, మాంత్రికులు, తాంత్రికుల సీమ అని, పాములను పూజించేవారు నివసించే దేశమని అభిప్రాయం వుండేదని ఆయన చెప్పారు.
ఐటి విప్లవం వల్ల భారత్ కంప్యూటర్ నిపుణుల ఆవాసంగా ప్రసిద్ధిలోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
సిఐఐ ఈ రోడ్ షోను ఏర్పాటు చేసింది. అమెరికాపారిశ్రామిక రంగానికి అవసరమైన టెక్నాలజీని ఇండియన్ సంస్థలు కారుచౌకగా అందజేయగలవని చెప్పడం కోసం ఈ షోలను నిర్వహిస్తున్నారు. మరియెట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ హోటల్లో జరిగిన ఈ రోడ్ షోలో 100 మంది కంపెనీ ఎగ్జిక్యూటీవ్లు పాల్గొన్నారు. కారుచౌకగా అత్యంతనాణ్యమైన టెక్నాలజీ సర్వీసులు లభించడం, మేధో హక్కుల రక్షణకు పటిష్టమైన న్యాయవ్యవస్థ వుండటం వంటి కారణాల వల్ల ఇండియా అన్నిరకాలుగా అమెరికా కంపెనీలకు తగి వున్నదని వక్తలు పేర్కొన్నారు.
అమెరికా మాంద్యంపై అనేక అనుమానాలు వున్నా, ఐటి భవిష్యత్తు గురించి బెంగపడాల్సిన అవసరం లేదని మహాజన్ అన్నారు. భారత్లో ఐటికి ఉజ్జ్వల భవిష్యత్తు వున్నదని ఆయన చెప్పారు. భారతదేశంలోని విద్యార్ధుల్లో 90 శాతం మంది ఐటి కోర్సులపై మక్కువ చూపిస్తున్నరు, పెళ్లీడుకొచ్చిన అమ్మాయిల్లో 70 శాతం మంది ఐటి ఉద్యోగాల్లో వున్న వరులనే కోరుతున్నారు, ఐటి భవిష్యత్తుకు ఇంతకన్నా వేరేం నిదర్శనం కావాలని ఆయన చతురోక్తి విసిరారు.
నాణ్యత విషయంలో మాట్లాడే అవసరమే లేదని అమెరికా కంటే నాణ్యమైన సర్వీసులను, ఉత్పత్తులను భారత్ అందజేస్తున్నదని పానెల్ స్పీకర్ సునీల్ వాద్వానీ పేర్కొన్నారు. అడోబ్ డెవలప్మెంట్ వర్క్లో 50 శాతం ఇండియాలోనే జరుగుతున్న విషయం ఆయన ప్రస్తావించారు. అంతకు ముందు మెర్రీలించ్ చైర్మన్ జోసఫ్ చెల్ మాట్లాడుతూ, ఐటి విద్యారంగంలో భారత్ పాటవాన్ని ప్రశంసించారు.