ప్రధాని సారథ్యలో అఖిలపక్షం ప్రారంభం
న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ శిఖరాగ్ర సభకు సంబంధించిన అంశాలపై ప్రతిపక్షాలు, మిత్ర పక్షాల అభిప్రాయాన్ని తీసుకునేందుకు ప్రధాని వాజ్పేయి ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం సోమవారం నాడు ఢిల్లీలో ప్రారంభమైంది. 35 పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు కేంద్ర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.
ముషారఫ్తో శిఖరాగ్ర చర్చల్లో జమ్మూ కాశ్మీర్తో సహా భారత్ ప్రస్తావించనున్న వివిధ అంశాలను ఈ సమావేశానికి ప్రధాని వివరించనున్నారు. అదే విధంగా ఆల్పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ను భారత్ అభ్యంతరాలను లెక్కచేయకుండా పాక్ టీ పార్టీ ఆహ్వానించిన దరిమిలా ఉత్పన్నమైన పరిస్థితిని కూడా ప్రధాని సమావేశానికి వివరిస్తారు. ఉపఖండంలో శాంతికి దొహదం చేయగలదని ప్రభుత్వం విశ్వసిస్తున్న ఈ శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన ప్రభుత్వ వ్యూహంపై అఖిల పక్ష సమావేశం అభిప్రాయాలను సేకరించిన తర్వాత ప్రభుత్వం వ్యూహంలో అవసరమైన మార్పులు చేస్తుంది.