పోలీసులకు జయలలిత కితాబు
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డిఎంకె నేత కరుణానిధి, మరో ఇద్దరు కేంద్ర మంత్రులు మురసోలి మారన్, బాలు అరెస్టు సందర్భంగా తమిళనాడు పోలీసులు తమ పరిధిని ఏ మాత్రం అతిక్రమించలేదని అత్యంత మర్యాదపూర్వకంగా ప్రవర్తించారని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. పోలీసుల ప్రవర్తనపై డిఎంకె నేతలు చేస్తున్న విమర్శలు పూర్తిగా అబద్దమని ఆమె మంగళవారం నాడు విడుదల చేసిన 10 పేజీల సుదీర్ఘ ప్రకటనలో వెల్లడించారు.
పోలీసులపై డిఎంకె నేతలు అకారణంగా నిందలు వేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. కరుణానిధి వంటి సీనియర్ నేతను అరెస్టు చేసేప్పుడు శాంతిభద్రతల సమస్య వుంటుంది కనుక రాత్రివేళల్లో అరెస్టు చేయడం మామూలు విషయమేనని ఆమె వివరించారు. కరుణానిధి అరెస్టు సమయంలో కేంద్ర మంత్రులు ములసోలి మారన్, బాలు అనవసరంగా రభస సృష్టించారని ఆమె దుయ్యబట్టారు.
తగినంత సమయం ఇచ్చే కరుణానిధిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆమె చెప్పారు. అయినా డిఎంకె చేస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను బయటపెట్టేందుకే తాను ఏకసభ్య కమిషన్ నియమించానని ఆమె వెల్లడించారు. అసలు నిజాలు బయటకొస్తే తమనాటకం బయటపడుతుందన్న భయంతో డిఎంకె నేతలు విచారణను బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించారని ఆమె ఆరోపించారు.