తెలుగుదేశం వల్లే బీసీలకు అధికారం
అనంతపురం: వెనకబడిన వర్గాల అభ్యున్నతికి అన్ని రాజకీయ పార్టీలకంటే అత్యధికంగా కృషిచేసింది తెలుగుదేశం పార్టీనేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తెలుగుదేశం కృషివల్లనే రాష్ట్రంలో బిసిలకు రాజకీయాధికారంలో వాటా లభించిందని ఆయన చెప్పారు.
వెనకబడిన వర్గాల ప్రజలకోసం మాత్రమే కాకుండా రాష్ట్రంలోని వెనకబడిన ప్రాంతాల అభివృద్ది కోసం కూడా తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్టుగా ఆయన వెల్లడించారు. బుధవారం నాడు అనంతపురం, కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ తమ ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కువిమర్శలకు దిగుతున్నదని ఆయన దుయ్యబట్టారు.
ప్రజలందరికీ గ్యాస్ కనెక్షన్ అందేవరకు దీపం పథకం కొనసాగిస్తామని కూడా ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ ఏ ఎండకాగొడుకు పట్టే పార్టీ అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్కు ఒక సిద్ధాంతం లేదని ఆయన అన్నారు. ప్రజలు తనకు అండగా వున్నంతవరకు తాను ఏ శక్తికీ భయపడనని ఆయన చెప్పారు. ప్రజల ఆశిస్సులతో స్వర్ణాంధ్రప్రదేశ్ను సాధిస్తానని ఆయన చెప్పారు. అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధమని ప్రకటించారు.