అందరి కళ్లూ ఆగ్రాపైనే
ఆగ్రా: భారత్, పాకిస్తాన్ అగ్రనేతల మధ్య శిఖరాగ్ర చర్చలకు ఆగ్రాలో సర్వం సిద్ధమయింది. ఇద్దరు నేతలు కూడా ఆగ్రా చేరుకున్నారు. భారత ప్రధాని వాజ్పేయి శనివారం అర్ధరాత్రే ఆగ్రాకు చేరుకోగా, ముషారఫ్ ఆదివారం ఉదయం తమ అర్ధాంగితో సహా ఆగ్రా చేరుకున్నారు. ఉదయం 11.30 గంటలకు ఇద్దరు అగ్రనేతల మధ్య చర్చలు ప్రారంభం అయ్యాయి.
ఉదయం సరిగ్గా 11.30 గంటలకు జనరల్ ముషారఫ్ చర్చలు జరుగుతున్న జెపి హోటల్కు చేరుకున్నరు హోటల్ వద్ద ప్రధాని వాజ్పేయి పాక్ నేతకు స్వాగతం చెప్పారు. ఈ శిఖరాగ్ర సభల సందర్భంగా ఆగ్రాలో పెద్దఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉపఖండంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టగలవని భావిస్తున్న ఈ చారిత్రక శిఖరాగ్ర సభ ఫలితాలకోసం యావత్ ప్రపంచం ఇప్పుడూ ఎదురుచూస్తున్నది.
దేశదేశాలకు చెందిన మీడియా ప్రతినిధులతో ఆగ్రా క్రిక్కిరిసి పోయింది. కాశ్మీర్ విషయంలో తాము పట్టుదలగా వున్నట్టు ముషారఫ్ ప్రకటించడం ముషారఫ్ బాటలోనే అంతే నిర్మోహమాటంగా కాశ్మీర్ ఒక్కటే ప్రధానం కాదని భారత్ స్పష్టం చేయడంతో ఈ శిఖరాగ్ర సమావేశంలో ఉభయ దేశాల నేతల మధ్య చర్చల సరళి ఏవిధంగా వుంటుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొనివున్నది.