అవసరమైతే చర్చల పొడగింపు
ఆగ్రా: భారత ప్రధాని వాజ్పేయి, పాకిస్తాన్ నేత ముషారఫ్ మధ్య సాగుతున్న శిఖరాగ్ర చర్చలను అవసరమైతే రేపటివరకు పొడగించే అవకాశం వుంది. చర్చలు ప్రారంభమైన తొలి దశ సూచనలను బట్టి అధికారులు ఈ విషయం చెప్పారు. ఆదివారం ఉదయం ఉభయదేశాల నేతల మధ్య ప్రారంభమైన చర్చల తొలిరౌండ్లో భారత్ తరఫున 12 మంది, పాకిస్తాన్ తరఫున 14 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ తొలి రౌండ్ తర్వాత ఇద్దరు నేతలు ముఖాముఖి కాసేపు చర్చించే అవకాశం వుంది. ఈ చర్చల సరళినిబట్టి అవసరమైతే రేపటివరకు వీటిని పొడగిస్తారు. చర్చల్లో ప్రధానికి హోంమంత్రి అద్వానీ, విదేశాంగ మంత్రి జస్వంత్సింగ్ సహకరిస్తున్నారు. కాగా ఆర్ధిక మంత్రి యశ్వంత్సిన్హా, వాణిజ్య శాఖ మంత్రి మురసోలి మారన్ కూడా ప్రధానికి అందుబాటులో వున్నారు. కాగా అధికారుల్లో ప్రధాని ప్రత్యేక కార్యదర్శి బ్రిజేష్ మిశ్రా, విదేశాంగ శాఖ కార్యదర్శఇ చోకిలా అయ్యర్, వగైరా వున్నారు. చర్చల మధ్యలోనే రెండు గంటల ప్రాంతంలో భోజనాలకు వెళ్లుతారు. భోజన విరామం తర్వాత మళ్లీ చర్చలను పునరుద్దరిస్తారు.