అసెంబ్లీ సమావేశానికి వైఎస్ డిమాండ్
హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొని వున్నాయని ఈ విషయమై సమగ్ర చర్చకు వీలుగా ప్రభుత్వం తక్షణమే అసెంబ్లీని సమావేశపర్చాలని సిఎల్పి నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికల హడావుడిలో వున్న పాలకపక్షం ఇప్పటికైనా సమస్య తీవ్రతను గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు.
తొలకరి జల్లులు పడగానే విత్తనాలు వేసిన రాష్ట్ర రైతాంగం గత రెండునెలలుగా వర్షాలు లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నదని మరోవైపు తాగు నీటి కటకటతో వేలాది గ్రామాల్లో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు. ఇంత జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదని ఆయన దుయ్యబట్టారు. ఆగస్టులో అసెంబ్లీ సమావేశాలు జరిపే ఆనవాయితీ వున్నదని అయితే ప్రభుత్వానికి మాత్రం ఆ వుద్దేశ్యం వున్నట్టుగా లేదని ఆయన ఆరోపించారు.
ఇదిలా వుండగా రాష్ట్రంలో వరసగా మూడో సంవత్సరం కరవు పరిస్థితుల తీవ్రతను చర్చించడానికి వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. మంగళవారం నాడు జరిగిన సిపిఎ రాష్ట్ర కమిటీ సమావేశం ఈ మేరకు ఒక తీర్మానం చేసింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై ఆరు వారాలు గడిచినా వర్షాభావ పరిస్థితుల వల్ల ఎక్కడా పంటలు వేయలేని పరిస్థితి నెలకొన్నదని సిపిఎం పేర్కొన్నది.