డామిట్ కథ అడ్డం తిరిగింది.....
చిత్తూరు: చిత్తూరులో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వున్నప్పటికీ ఉపాధ్యక్ష పదవి విషయంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఏర్పడిన అంతర్గత కుమ్ములాటలతో ఇద్దరు సభ్యులు సమావేశానికి గైర్హాజరు కావడంతో కోరం కొరవడి జడ్పి చైర్మన్ ఎన్నికలు వాయిదా వేయాల్సివచ్చింది.
స్వయంగా కాంగ్రెస్ అగ్రనేతలు పిసిసి సారథి సత్యనారాయణరావు, సిఎల్పి నేత వైఎస్ గత రెండు రోజులుగా జిల్లాలోనే మకాంవేసి అసమ్మతి, సమ్మతి వర్గాలను బుజ్జగించి రాజీ కుదిర్చినట్టుగా ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే అంతర్గత విబేధాల కారణంగా ఎన్నికలు వాయిదా పడటం గమనార్హం. గత 23న కూడా ఇదే రకమైన అంతర్గత కుమ్ములాటలతో వాయిదా పడిన ఎన్నికలు ఈ సారి సజావుగా జరుగుతాయని కాంగ్రెస్ అగ్రనేతలు శనివారం ఉదయం ఎన్నికలు జరగడానికి కొన్ని గంటల ముందు వరకు ధీమాగా వున్నారు.
ఆఖరు క్షణంలో కథ అడ్డం తిరగడంతో వారికి పరిస్థితి మింగుడుపడకుండా తయారయింది. జిల్లా కాంగ్రెస్ నాయకులపై కాంగ్రెస్ అగ్రనేతలు తీవ్రంగా విరుచుకుపడ్డట్టుగా తెలిసింది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ నాయకత్వం సీరియస్గా వుంది. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్, సిపిఎం సభ్యులు సమావేశానికి గైరాజరయ్యారు. సమావేశం ఆరంభంతోనే జడ్పికార్యాలయంతో టిఆర్ఎస్ జడ్పిటిసి సభ్యులు సిద్ధంగా వున్నప్పటికీ కోరం సరిపోకపోవడంతో ఎన్నికలను వాయిదా వేశారు. కాంగ్రెస్ సభ్యుల వైఖరిపై టిఆర్ఎస్ తీవ్రంగా విరుచుకుపడింది