పంకజ్కు పదిరోజుల పోలీసు రిమాండ్
న్యూఢిల్లీ: సమాజ్వాద్ ఎంపి ఫూలన్దేవి హత్యకేసులో ప్రధాన నిందితునిగా భావిస్తున్న షేర్ సింగ్ రాణా అలియాస్ పంకజ్ సింగ్ను పదిరోజుల పాటు పోలీసు రిమాండ్లో వుంచాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. పంకజ్ను శుక్రవారం నాడు పోలీసులు డెహ్రాడూన్లో అరెస్టు చేసిన విషయం విదితమే. ఆయన్ను అరెస్టు చేసిన తర్వాత పోలీసులు ఢిల్లీ తరలించారు.
ఢిల్లీ పోలీసులు శనివారం నాడు న్యాయస్థానం ముందు హాజరుపర్చగా పదిరోజుల పాటు పోలీసు రిమాండ్లో వుంచాల్సిందిగాన్యాయమూర్తి ఆదేశించారు. తిరిగి ఆగస్టు 7న పంకజ్ను న్యాయస్థానం ఎదుట హాజరుపర్చాల్సిందిగా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ విమల్ కుమార్ యాదవ్ ఆదేశించారు.
ఫూలన్ హత్యకేసులో నిందితులైన మరో ముగ్గురు వ్యక్తుల కోసం తాము జరుపుతున్న గాలింపునకు పంకజ్ అవసరం వుంటుందని అందువల్ల పంకజ్ను పోలీసు కస్టడిలో వుంచడానికి అనుమతించాల్సిందిగా పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. ఫూలన్ హత్యకు పంకజ్ చెబుతున్న కారణాలను పోలీసులు పూర్తిగా విశ్వసించడం లేదు. పదేళ్ల క్రితం బహమాయ్లో ఫూలన్ జరిపిన ఠాకూర్ల ఊచకోతకు ప్రతీకారంగా ఈ హత్య చేసినట్టుగా పంకజ్ పోలీసులకు చెప్పాడు. పంకజ్కు సహకరించిన శేఖర్, రవీందర్ కోసం ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్దఎత్తున పోలీసులు గాలింపు జరుపుతున్నారు.