విప్రో, ఇన్ఫోసిస్ రెడ్ సిగ్నల్
ముంబాయిః మాంద్యం ప్రభావం క్రమంగా భారతీయ ఐటి రంగంపై కనిపిస్తున్నది. దేశంలోని రెండు బడా ఐటి సంస్థలు విప్రో, ఇన్ఫోసిస్ ఈ ఏడాది జరిపిన కాంపస్ రిక్రూట్మెంట్లకు సంబంధించి జాయినింగ్ డేట్స్ను మరికొన్ని నెలలు వాయిదా వేస్తున్నట్టుగా ఎంపికయిన అభ్యర్దులకు లేఖలు రాశాయి. విప్రో ఈ ఏడాది మొదట్లో సుమారు 750 మంది ఇంజనీర్లను కాంపస్ రిక్రూట్మెంట్ మార్గంలో ప్రతిష్టాత్మకమైన సంస్థల నుంచి రిక్రూట్ చేసుకున్నది.
వీరంతా ఈ ఏడాది జూన్, జులైలోనే ఉద్యోగాల్లో చేరాల్సివుండగా అందులో 20 శాతం మందిని మాత్రమే ఇప్పటి వరకు చేర్చుకున్నారు. మిగిలిన వారిని ప్రాజెక్టులు లేవనే కారణంతో కొంతకాలం ఓపిక పట్టాల్సిందిగా కోరుతున్నట్టు తెలిసింది. ఇన్ఫోసిస్ కూడా పెద్ద సంఖ్యలో కాంపస్లనుంచి రిక్రూట్ చేసుకున్న ఫ్రెషర్స్ను ఏడాది చివరవరకు ఆగాల్సిందిగా కోరినట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా విప్రోకు 9795 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాది ఉద్యోగాల్లో కోతలు లేనప్పటికీ కొత్త రిక్రూట్మెంట్లు మాత్రం లేవు. ఇన్ఫోసిస్లో సుమారు 10 వేల మంది ఉద్యోగులు వుండగా వారికే చేతినిండా పనిలేదని సంస్థ వర్గాలు అంటున్నాయి. పనిలేనప్పటికీ ఎవరినీ తీసివేయరాదనే విధానానికి ఇన్ఫోసిస్ కట్టుబడి పనిచేస్తున్నది.