ఆకలి చావులపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీః భారత ఆహార సంస్థ గోదాముల్లో ధాన్యం అపరిమితంగా ఉన్నా దేశంలో ఆకలి చావుల సంఘటనలు చోటుచేసుకోవడం పట్ల దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా ప్రతిస్పందించింది. నిల్వసామర్థ్యాన్ని మించి గోదాముల్లో పేరుకుపోయిన ఆహార ధాన్యాలు వృధాగా నాశనం కాకుండా వాటిని అన్నార్తులకు చేర్చడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కర్తవ్యమని కోర్టు స్పష్టం చేసింది.
ఆహార ధాన్యాలు పురుగుపట్టిపాడైపోవడం, ఎలుకలు తినేయడం, లేదా వాటిని సముద్రం పాలు చేయడం వంటి పరిస్థితి తలెత్తకుండా ఎఫ్సిఐ చర్యలు చేపట్టాలని జస్టిస్ బిఎన్ కిర్పాల్, జస్టిస్ సంతోష్ హెగ్డే, జస్టిస్ బ్రిజేష్ కుమార్లతో కూడిన డివిజన్ బెంచి సోమవారం నాడు సూచించింది.
ఆకలి చావులకు బాధ్యత ప్రభుత్వాలదేనని కోర్టు స్పష్టంచేసింది. రాజస్తాన్,ఒరిస్సా, ఛత్తీస్గడ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రాల్లో ఆకలి చావుల ఉదంతాలనువివరిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పనికి ఆహార పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్దితో అమలు చేయడంలేదని ఆరోపిస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని కోర్టువిచారణకు స్వీకరించింది. ఆహార ధాన్యాలు ఉచితంగా ఇవ్వాల్సివస్తే ఇచ్చి తీరాలి, డబ్బు లేదన్న కారణంగా ఏ వ్యక్తీ ఆకలితో చినిపోరాదు అని కరాఖండిగా కోర్టు తేల్చిచెప్పింది. గోదాముల్లో సమృద్ధిగా ధాన్యం వున్నా దేశంలో ఆకలి చావులు వుండటమేమిటని న్యాయమూర్తులు ఆగ్రహంగా ప్రశ్నించారు. ఆకలి చావుల నివారణకు పకడ్బందీస్కీమ్ను తయారు చేయాలని కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.