టూరిజానికి కేంద్రం రూ.200 కోట్లు ఖర్చు
హైదరాబాద్: రాష్ట్రంలోని పర్యాటక ప్రాజెక్టులపై కేంద్రం 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని కేంద్ర పర్యాటకాభివృద్ధి మంత్రి అనంతకుమార్ చెప్పారు. ఆయన శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కలుసుకున్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాజెక్టుల పథకాలను చంద్రబాబు కేంద్ర మంత్రికివివరించారు. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి కేంద్ర అన్ని విధాలా సహాయంఅందిస్తుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. విశాఖపట్నం,అరకు, భీముని పట్నంలోని ప్రదేశాల అభివృద్ధి వల్ల ముఖ్య పర్యాటక కేంద్రంగా మారుతుందని ఆయన అన్నారు.
రాష్ట్రంలోని అన్నవరం, కనకదుర్గ, సింహాచలం, తదితర దేవాలయాలనేకం వున్నాయని, చారిత్రక ప్రదేశాలు కూడా చాలా వున్నాయని,వీటన్నింటినీ పర్యాటక కేంద్రాలుగా తీర్చి దిద్దుతామని ముఖ్యమంత్రి చెప్పారు. ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో తలపెట్టిన పర్యాటక భవనానికి వచ్చే నెల 27వ తేదీన హైదరాబాద్లో శంకుస్థాపన జరుగుతుందని ఆయన చెప్పారు.
పది వేల కోట్ల రూపాయల విలువ చేసే 173 నిజాం ఆభరణాల ప్రదర్శనను హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంలో నవంబర్లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. ఈ ప్రదర్శన ఆరు వారాల పాటు వుంటుందని ఆయన చెప్పారు. మొదట ఈ ఆభరణాల ప్రదర్శనను న్యూఢిల్లీలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రదర్శనను ప్రధాని వాజ్పేయి ప్రారంభిస్తారని ఆయన చెప్పారు.
నిజాం ఆభరణాలు రాష్ట్ర ఆస్తి అని, హైదరాబాద్ ఆస్తి అని,అందువల్ల వాటిని శాశ్వతంగా రాష్ట్రానికి అప్పగించాలని, వాటికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయగలమని చంద్రబాబు కేంద్ర మంత్రితో అన్నారు.