ఆకలిచావుల నివారణకు పథకం: ప్రమోద్
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఆకలి చావుల నివారణకు స్పష్టమైన పథకాన్ని రూపొందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమోద్ మహాజన్ బుధవారం లోక్సభలో చెప్పారు. గిడ్డంగుల్లో ఆహార ధాన్యాల నిల్వలు పేరుకుపోయినప్పటికీ వివిధ రాష్ట్రాల్లో ఆకలి చావులు సంభవిస్తుండడం పట్ల ప్రతిపక్షాలు సభలో ఆందోళన వ్యక్తం చేశాయి. ఆకలి చావుల నివారణకు రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రధాని ఒక సమావేశం ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలని సోనియాతో సహా వివిధ పార్టీల నాయకులు చేసిన డిమాండ్కు మంత్రి అంగీకరించారు.
ఈ విషయంపై రాజ్యసభలో తెలుగుదేశం సభ్యుడు కళా వెంకట్రావ్ ప్రభుత్వాన్నినిలదీశారు. జిల్లాలవారీగా డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వాలు పంపితే ధాన్యం నిల్వలు విడుదల చేయడానికి కేంద్రం సిద్ధంగా వున్నదని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. ధాన్యానికి కొరత లేదని తాము చెప్తూనే వున్నామని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్కు తగిన ధాన్యం నిల్వలను విడుదల చేశామని ఆయన చెప్పారు. ఒరిస్సాలోని ఆకలి చావులతో కేంద్రానికి సంబంధం లేదని ఆయన చెప్పారు. కేంద్రం ధాన్యం నిల్వలు విడుదల చేసినా పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని వెంకయ్యనాయుడు చేసిన ప్రకటన సభలో గందరగోళానికి దారి తీసింది. ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వాలను తప్పు పట్టే ఉద్దేశం తనకు లేదని వెంకయ్యనాయుడు చెప్పడంతో సభ సద్దుమణిగింది.