జడ్జీలపై పోలీసుల లాఠీ
ఆగ్రాః ఆగ్రాలో పోలీసులు కోర్టు భవనంపై దాడి చేసి సృష్టించిన బీభత్సంలో జిల్లా సెషన్స్ జడ్జి, మరో ముగ్గురు న్యాయాధికారులు వందమందికి పైగా లాయర్లు తీవ్రంగా గాయపడ్డారు.
మంగళవారం నాడు ఈ సంఘటన జరిగింది. అలహాబాద్ హైకోర్టు బెంచిని ఆగ్రాలో ఏర్పాటు చేయాలని స్థానిక న్యాయవాదులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన సందర్భంగా న్యాయవాదులు ఇద్దరు పోలీసులపై చేయిచేసుకున్నారనే ఆరోపణతో వందలాది మంది పోలీసులు విరుచుకుపడి బార్ అసోసియేషన్హాల్లోకి దూసుకుపోయి సమావేశంలో వున్న లాయర్లను దొరిగిన వారిని దొరికినట్టుగా చితకబాదారు.
న్యాయమూర్తులను కూడా వారు విడిచిపెట్టలేదు. జిల్లా జడ్జి వి ఎస్ వాజ్పేయి రెండు వేళ్లువిరిగిపోయాయి. అదనపు సెషన్స్ జడ్జి సిఎం దీక్షిత్, అదనపు చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ అల్లారఖాఖాన్, అదనపు సివిల్ జడ్జి సుభాష్ చంద్కు కూడాదెబ్బలు తగిలాయి. రెండు గంటల పాటు ఈ విధ్వంసం సాగింది. లాయర్లు ఉరుకులు పరుగులతో సమీప రోడ్డులో ట్రాఫిక్ స్తంభించిపోయింది. జిల్లా మేజిస్ట్రేట్ కమలేష్, ఎస్పీ తివారీ అక్కడకు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆగ్రా కోర్టులను రెండు రోజుల పాటు మూసేయాల్సిందిగా జిల్లాసెషన్స్ జడ్జి అలహాబాద్ హైకోర్టును కోరుతూ నివేదికపంపారు.