పాక్లో ప్రదర్శనలవెల్లువ-ముగ్గురు మృతి
ఇస్లామాబాద్ః అమెరికా వ్యతిరేక ప్రదర్శనలతో పాకిస్తాన్ అట్టుడికి పోతున్నది. వరుసగా మూడో రోజు కూడా పాకిస్తాన్ లోని వివిధ ప్రాంతాల్లో ఆమెరికా, ముషారఫ్ వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి. వందలాది మంది మతఛాందస నేతలను పాక్సైనికులు అరెస్టు చేశారు. క్వెట్టాలో ఈ ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి.
ఈ సందర్భంగా పోలీసులు జరిపిన దాడుల్లో ముగ్గురు ప్రదర్శన కారులు దుర్మరణం పాలయ్యారు.క్వెట్టాకు 25 కిలోమీటర్ల దూరంలోని కచాలక్ పోలీస్టేషన్ పై దాడికి ప్రయత్నించిన సందర్భంగా పోలీసులు కాల్పులు జరపడంతో ఈ ముగ్గురు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.క్వెట్టాతా పాటు రావల్పిండి, ఇస్లామాబాద్ లో అమెరికా వ్యతిరేక పాకిస్తానీయులతో పాటు ఆఫ్ఘన్ శరణార్ధులు కూడా వందల సంఖ్యలో ఈ ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు.
ఆఫ్ఘన్ పై దాడికి దిగినందుకు అమెరికాను, అందుకు వత్తాసు పలికినందుకు పాక్ సైన్యాధ్యక్షుడు ముషారఫ్ ను వారు దుమ్మెత్తి పోస్తున్నారు. ముషారఫ్ వ్యతిరేక నినాదాలతో బెలూచిస్తాన్ దద్దరిల్లి పోయింది. ఆఫ్ఘనిస్తాన్ అనుకూల ప్రదర్శనలు ఊపందుకోవడం,పైగా హింసాత్మకంగా మారుతుండడంతో ముషారఫ్ ప్రభుత్వం కలవర పడుతున్నది.