పట్టణాల్లో రెండు వేల కోట్లతో గృహవసతి
న్యూఢిల్లీ: దేశంలోని పట్టణ ప్రాంతాల్లో గల పేదలకు, మురికి వాడల నివాసితులకు రెండు వేల కోట్లతో గృహ వసతి కల్పించాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అనంతకుమార్ విలేకరులకు చెప్పారు.
వాల్మికీ అంబేడ్కర్ ఆవాస్ యోజన పేర ఈ పథకాన్ని దేశంలో ఐదు వేలకు పైగా పట్టణాల్లో అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పథకాన్ని ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని ప్రకటించారని ఆయన చెప్పారు. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు, మురికివాడల్లోని ప్రజలకు ఈ పథకం కింద 2010 నాటికి గృహవసతి, పారిశుధ్య సౌకర్యాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. ఈ రెండు వేల కోట్లలో సగం సబ్సిడీగా, మిగతా సగం రుణంగా సమకూర్చనున్నట్లు ఆయన తెలిపారు. ఇటువంటి పథకం దేశంలో ఇదే మొదటిదని ఆయన అన్నారు.