అమెరికా దాడుల్లో 11 మంది పౌరుల మృతి
కాబూల్: కాబూల్పై ఆదివారం అమెరికా చేసిన దాడుల్లో 11 మంది పౌరులు మృతి చెందినట్లు, మూడు ఇళ్లు ధ్వంసమైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మరణించినవారిలో ఎనమండుగురు పిల్లలు ఉన్నారు.ఒకే కుటుంబానికి చెందిన ఎనమండుగురు ఈ దాడుల్లో మరణించారు. తలిదండ్రులతో పాటు వారి ముగ్గురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఈ దాడుల్లో మరణించినట్లు వారు తెలిపారు. ఈ బాంబు దాడి ఆదివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో జరిగింది.
తన కుమారుడిని కోల్పోయిన తండ్రి 45 ఏళ్ల అహీబ్ దాద్ మృతదేహాన్ని చేతుల్లో పట్టుకునివిలపిస్తున్న దృశ్యం కదిలించేదిగా వుంది.విమానం చప్పుడు విని తాను బయటకు వచ్చానని, తాను చూసేంతలోనేవిమానం బాంబులు వేసిందని, ఈ దాడిలో తన ఇద్దరు కుమారుల్లో ఒకరు చనిపోయారని ఆయన చెప్పాడు. తన ఇళ్లంతా ధ్వంసమైందని, తనకు దైవం తప్ప మరో దిక్కు లేదని అతను అన్నాడు.
ఇదిలా వుంటే, అమెరికా బాంబు దాడుల్లో ఆదివారంనాడు తొమ్మండుగురు పిల్లలు మరణించినట్లు ఆల్ జజీరా ప్రకటించింది. ఆదివారంనాడు ఉదయం అమెరికావిమానాలు కాబూల్పై రౌండ్లు కొడుతూనే వున్నాయని, దీంతో కాబూల్ ప్రజలు భయాందోళనలతో పరుగులు తీస్తున్నారని ఆల్ జజీరా చెప్పింది.