6న కార్మిక సంఘాలసార్వత్రిక సమ్మె
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ఆర్టిసి) కార్మికుల సమ్మెకు మద్దతుగా నవంబర్ 6వ తేదీన సార్వత్రిక సమ్మె చేయాలని రాష్ట్రంలోని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఆదివారంనాడిక్కడ జరిగిన సదస్సులో నిర్ణయం తీసుకున్నాయి. ఈ లోగా ప్రదర్శనలు, ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. క్యాజువల్స్ చేతగానీ, పోలీసుల చేతగానీ, మరెవరి చేతనైనా బస్సులను నడపాలని ప్రయత్నిస్తే వాటిని ఎక్కడికక్కడ ఆపేస్తామని సిఐటియు నాయకుడు వీరయ్య విలేకరులకు చెప్పారు. బ్యాంక్ ఉద్యోగుల, ఇన్సూరెన్స్ ఉద్యోగుల సంఘాలు కూడా ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొంటాయి.
ఇదిలా వుంటే, ఆర్టీసి కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ప్రత్యక్ష పోరాటానికిసిద్ధమవుతోంది. ఆదివారంనాడు 14వ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసి కార్మికుల సమ్మె కొనసాగింది. ఆదివారంనాడు రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు జరిగాయి.శ్రీకాకుళంలో జరిగిన నిరాహార దీక్షలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుపతిలో పది మంది నిరాహార దీక్షకు పూనుకున్నారు. రాజమండ్రిలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది.విజయవాడలో కాంగ్రెస్, వామపక్షాలు, జెఎసి నేతలు నిరాహార దీక్షలు చేపట్టారు.
ఆర్టీసి కార్మికుల డిమాండ్లు సమంజసమైనవేనని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆర్టీసి సమ్మెపై అఖిల పక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేదంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ప్రజా సమస్యలపై ఉన్న శ్రద్ధ ఏమిటోఅర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.