దేశం నేతల అసంతృప్తి
హైదరాబాద్ః ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిని అధికార తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా గర్హిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో సమ్మె విరమణకు ప్రభుత్వం ప్రయత్నించకపోతే ప్రజల్లో పార్టీ పరువు ప్రభుత్వం పరువు పోయే ప్రమాదం వున్నదని వారు హెచ్చరిస్తున్నారు.
సోమవారం నాడు పార్టీ ప్రధాన కార్యాలయంలో కొంతమంది పార్టీనేతలతో ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు యిష్టాగోష్టిగా సమావేశమై చర్చలు జరుపుతుండగా ఆర్టీసీ సమ్మె వ్యవహారం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా పార్టీ నేతలు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ముఖ్యమంత్రి కంగుతిన్నట్టుగా చెబుతున్నారు.
15 రోజులుగా సాగుతున్న సమ్మెకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేసిన ప్రచారం కంటే సమ్మెకు అనుకూలంగా జరిగిన ప్రచారమే ఎక్కువగా వున్నదని కొందరు తెలుగుదేశం నేతలు ముఖ్యమంత్రికి సూచించినట్టుగా తెలిసింది. ఆర్టీసీ వావాహనాలపై విధిస్తున్న పన్నుకు ప్రైవేట్ వాహనాలపై విధిస్తున్న పన్నుకు నూరు శాతం తేడావుండటంపై ఆర్టీసీ సిబ్బంది చేస్తున్న ప్రచారాన్ని ప్రజలువిశ్వసిస్తున్నారని వారు చెప్పినట్టుగా తెలిసింది. పార్టీ నేతలు గట్టిగా మాట్లాడటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమ్మె పరిష్కారానికి ప్రభుత్వం ఒక మెట్టు దిగి ప్రయత్నం చేస్తుందని హామీ ఇచ్చినట్టుగా తెలిసింది.