హైదరాబాద్ః నెక్లెస్రోడులోని పీపుల్స్ప్లాజా వేదికగా శనివారం నాడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన యుద్ధ విమానాలు చేసిన విన్యాసాలు నగరప్రజలను అబ్బురపరిచాయి. శుక్రవారం నాడే ఈ విన్యాసాల డ్రెస్ రిహార్సల్ను లక్షలసంఖ్యలో టాంక్బండ్ బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు వద్దకు చేరుకుని తిలకించిన నగర ప్రజలు, పాఠశాలల విద్యార్ధి, విద్యార్ధినులు శనివారం కూడా పొద్దున్నే నెక్లెస్ రోడ్పై హుసెన్సాగర్ చుట్టూ నిండిపోయారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఎయిర్షోకు ప్రారంభోత్సవం చేస్తూ యువతలో ముఖ్యంగా భావిభారత పౌరుల్లో ఎయిర్షోల వల్ల దేశభక్తి ఉప్పొంగుతుందని చెప్పారు.అయినవారికి దూరంగా సరిహద్దుల్లో మాతృదేశ సంరక్షణకోసం విధులు నిర్వహిస్తున్నసైనికుల త్యాగాలు వారికి అర్ధమవుతాయని ఆయన చెప్పారు. వైమానికదళం ప్రధానాధికారి ఎయిర్మార్షల్ ఎవై టిప్నిస్ కూడా ఎయిర్షోను తిలకించారు.
బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు వద్ద మాత్రమే కాకుండా ఖైరతాబాద్, సికింద్రాబాద్, పంజాగుట్ట, రాజ్భవన్రోడ్ వంటి ప్రాంతాల్లోని ఎత్తైన భవనాలపై కూడాపెద్దసంఖ్యలో ప్రజలు చేరిపోయారు. జూబ్లిహిల్స్, బంజారహిల్స్ వంటి కొండప్రాంతాల్లోని భవనాలపై నుంచి కూడా పలువురు ఈ వేడుకలను తిలకించారు.
చేతక్ హెలికాప్టర్ పుష్పవర్షం కురిపించడంతో ప్రారంభమైన ఈ ఎయిర్షోలో సూర్యకిరణ్విమానాలు రకరకాల విన్యాసాలు చేస్తూ రంగుల్లో పొగను వదులుతూ ఆకాశంలో హరివిల్లును సృష్టించాయి. ఆగ్రానుంచి ప్రత్యేకంగా వచ్చిన ఆకాశగంగ పారాట్రూపర్లు ఎనిమిదివేల అడుగుల ఎత్తునుంచి దూకి జరిపినవిన్యాసారు గగుర్పాటును కలిగించాయి. రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఈ ఎయిర్షోకు సహకారాన్నిఅందించింది.