ఇది పాక్ తీవ్రవాదసంస్థల పనే!
న్యూఢిల్లీః భారత పార్లమెంటుపై దాడి జరిగి ఇప్పటికే 24 గంటలు గడిచినప్పటికీ ఇందుకు బాధ్యులు ఎవరైందీ తెలియలేదు. ఏ తీవ్రవాద సంస్థ ఈ సంఘటనకు బాధ్యులం మేమంటూ ప్రకటించలేదు. అయితే ఈ ఘాతుకానికి పాకిస్తాన్ కు చెందిన తీవ్రవాద సంస్థ కారణం అయి వుండవచ్చునని అనుమానిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఒక టెలివిజన్ ఛానల్ లో మాట్లాడిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రమోద్ మహాజన్ ఇదే అభిప్రాయాన్ని సూటిగా కాకుండా పరోక్షంగా అంగీకరించారు. మనదేశంలో తీవ్రవాదాన్ని మనపొరుగుదేశమే ప్రోత్సహిస్తున్న విషయం అందరికీ తెలుసని ఆయన చెప్పారు. పాకిస్తాన్ తో పాటు అమెరికా, బ్రిటన్ వంటి దేశాలన్నీ భారత పార్లమెంటు భవనం పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించాయి.
వంద కోట్ల మంది భారతీయుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఏకంగా పార్లమెంటుపై దాడికి వ్యూహం పన్నిన వారిని పట్టుకొనేందుకు ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభించింది.అక్టోబర్ ఒకటిన కాశ్మీర్ అసెంబ్లీపై దాడి జరిపిన వారే ఈదాడికి కూడా పాల్పడి వుంటారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఉగ్రవాదులు కొందరు ఇంకా ఢిల్లీలోనే వున్నారనే అనుమానంతో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.