గృహనిర్మాణాల్లో అవినీతి పై రభస
హైదరాబాద్ః పేదలు, బలహీనవర్గాల కోసం ప్రభుత్వం చేపట్టే గృహనిర్మాణాల్లో భారీ ఎత్తున అక్రమాలు, అవినీతి చోటుచేసుకుంటున్నాయని కాంగ్రెస్ సభ్యులు చేసిన ఆరోపణలతో శనివారం నాడు అసెంబ్లీ హోరెత్తింది. కాంగ్రెస్ సభ్యులు ఆరోపణలను ఖండిస్తూ అధికార సభ్యులు కూడా పెద్దఎత్తున వాగ్యుద్ధానికి దిగడంతో సభలో గందరగోళం నెలకొన్నది.
ఈ అక్రమాలపై నిజానిజాల వెల్లడికి సభాసంఘంతో దర్యాప్తు జరిపించాలన్న డిమాండ్ను ప్రభుత్వం తిరస్కరించడంతో కాంగ్రెస్ సభ్యులు సభనుంచి వాకౌట్ జరిపారు. తొలుత చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో బలహీనవర్గాల కోసం నిర్మించిన ఇళ్లులో పెద్దఎత్తున అవినీతి చోటుచేసుకున్నదని ఆరోపిస్తూ సాక్ష్యాధారాలను కూడా సభముందు వుంచడానికి తాము సిద్ధంగా వున్నామని కాంగ్రెస్ సభ్యుడు కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి జిల్లాలోనే లక్షల రూపాయల విలువజేసే ప్రాజెక్టుకు కోట్ల రూపాయల ఖర్చు చూపించారని ఆయన ఆరోపించారు. కిరణ్కుమార్రెడ్డి శ్రీకాళహస్తి గురించి మాత్రమే ప్రస్తావించగా చర్చ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన బలహీనవర్గాల గృహనిర్మాణ ప్రాజెక్టులన్నింటిపైకీ మళ్లీంది. ఈ దశలో కాంగ్రెస్ సభ్యుల ఆరోపణలను మంత్రి రామసుబ్బారెడ్డి గట్టిగా ఖండించారు. అక్రమాలు జరిగిన వెంటనే చర్యలు తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది వుంటే సభాసంఘాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ సభ్యులు కోరారు. ప్రభుత్వం తమ డిమాండ్ను తిరస్కరించడంతో సభనుంచి వాకౌట్ చేస్తున్నట్టుగా వారు ప్రకటించారు.