హైదరాబాద్ః విద్యుత్ సమస్యపై గురువారం నాడు రాష్ట్ర అసెంబ్లీ దద్దరిల్లింది. అధికార ప్రతిపక్ష పార్టీలు పరస్పరం తీవ్రస్థాయిలో విమర్శులు, ప్రతివిమర్శలు చేసుకున్నారు. విద్యుత్ సరఫరా సమస్యపై సభలో 304 నిబంధన కింద ప్రారంభమైన చర్చ, విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ పంపిణి, విద్యుత్ సంస్కరణల వరకు విస్తరించింది. సుమారు 3 గంటల పాటు వాడిగా వేడిగా చర్చ సాగింది.అధికార, ప్రతిపక్ష సభ్యులు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, సంస్కరణల అమల్లో ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కంటే అగ్రస్థానంలో వున్నదని చంద్రబాబు నాయుడు చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడు రాష్ట్రంలో కరెంట్ వాడకం అతితక్కువ వున్నదని అందువల్ల అప్పుడు సమస్యలు రాలేదని చంద్రబాబు చెప్పారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా విద్యుత్ వాడకం పెరిగిందని ఆయన చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ ఇచ్చినట్టుగా సబ్సిడీలు ఇవ్వడం లేదని ఆయనచెప్పారు. కరవు, వర్షాభావ పరిస్థితి హైడ్రో స్టేషన్లు పనిచేయకపోవడం వల్ల ప్రస్తుత పరిస్థితి తలెత్తిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.రైతులకు ఆంధ్రప్రదేశ్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని ఆయన ఆవేశంగా ప్రకటించారు. ప్రభుత్వ వివరణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్, వామపక్షాలు, టిఆర్ఎస్ సభ నుంచి వాకౌట్ చేశాయి.