తీవ్రవాద దేశంగా ఎదుగుతోన్న పాక్
న్యూఢిల్లీ: పాకిస్థాన్ పూర్థి స్థాయి తీవ్రవాద దేశంగా ఎదుగుతోందని ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి విమర్శించారు. పాక్ ప్రేరిపత తీవ్రవాదాన్ని మూడేళ్ళ కాలంలో భారత్ బలంగా తిప్పికొట్టిందని వాజ్ పేయి అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పగ్గాలు చేపట్టి మూడేళ్ళు పూర్తి కావడంతో ప్రధాని ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో శుక్రవారం భారీ ర్యాలీ జరిగింది.
అనారోగ్యం కారణంగా నాలుగు రోజులు విశ్రాంతి తీసుకొన్న ప్రధాని బయటికి రావడం ఇదే ప్రథమం. ప్రధాని ఉల్లాసంగానే కనిపించాడు. రక్షణమంత్రి జార్జి ఫెర్నాండెజ్, ఉపప్రధాని ఎల్.కె.అద్వానీలు పాల్గొన్న ఈ ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ మాత్రం పాల్గొనలేదు.
పాకిస్థాన్ ఎత్తుగడలేవీ పారనీయకుండా తమ ప్రభుత్వం సమర్ధంగా వ్యవహరించిందని తెలిపారు. పాకిస్థాన్ పై ప్రధానంగా మాట్లాడనప్పటికీ ప్రధాని - ఆరెస్సెస్ గొడవలు, అద్వానీతో విభేదాలు తదితర అంశాలపై ప్రజలకు వివరణ ఇచ్చారు. అలాగే అతివాదులపై ఘాటుగా చురకలు వేశారు. ఆరెస్సెస్ నేత ప్రవీణ్ తొగాడియా సోనియాగాంధీపై చేసిన వ్యాఖ్యలకు స్పందనగా, ఇతరులను గౌరవించని వారిని ప్రజలు గౌరవించరని అన్నారు.
రాజకీయంలో హింసకు, అతివాదానికి, ఆఖరికి ఘాటైన మాటలకు చోటులేదు. ఇతరుల అభిప్రాయాలను, ఆచారలను గౌరవించడం అలవర్చుకోవాలి. అని ప్రధాని సూచించారు. అద్వానీతో విబేధాల గురించి ఆయన ఇచ్చిన వివరణ: కారణం తెలియదు కానీ అద్వానీకి, నాకు మధ్య విభేదాలు సృష్టించాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకు తెలుసు మేం ఇద్దరం కలిసికట్టుగా పనిచేస్తామని, కానీ మా మధ్య విభేదాలున్నాయని వాళ్ళకు వాళ్ళు అనుకొని సంతృప్తి పడుతున్నారు.
మూడేళ్ళలో తమ ప్రభుత్వం స్థిరమైన పాలన అందించిందని ప్రధాని వాజ్ పేయి అన్నారు. తీవ్రవాదం అణచివేయడంలో సఫలీకృతమయ్యమని తెలిపారు. .