రోడ్డుపైకి టీడీపీ అసమ్మతి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలోని అసంతృప్తి బయటికి ప్రదర్శితమౌతోంది. ఇప్పటివరకు తమ అసంతృప్తిని లోలోనే దాచుకున్న వారు బహిరంగపరుస్తున్నారు. తెలుగుదేశంలోని అసమ్మతి నేతలు మంగళవారం రోడ్డుమీదే ప్రదర్శనకు దిగారు. పార్టీ కేంద్రమైన ఎన్టీఆర్ భవన్ కు ప్రకాశం జిల్లాకు చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున విచ్చేసి తమ అసంతృప్తిని బహిరంగంగా ప్రకటించారు. మార్కపురం ప్రాంతానికి చెందిన కార్యకర్తలు బ్యానర్ల ద్వారా తమ ఉద్దేశాన్ని తెలియచేశారు. పార్టీలో సీనియర్లకు అన్యాయం జరుగుతోందని వారు అన్నారు.
దీంతో కాసేపు గందరగోళం చెలరేగింది. పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన స్లోగన్ లు చేశారు. అరుపులు, గోలలతో పార్టీ కార్యాలయం దద్దరిల్లింది. అనంతరం మార్కాపురం నేతలు విలేకరులను కలిసి వెలుగోడు ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలని సీఎంకు వినతి చేశామని తమ గోడును వెళ్ళగక్కారు. అయితే, ఆ జిల్లాకు చెందిన జంక వెంకటరెడ్డికి పదవి దక్కేలా పార్టీపై ఒత్తిడి తేవడమే వారి ఉద్దేశమని తెలిసింది. ఆ విధంగా జెండాలపై తమ నేత(వెంకటరెడ్డి) గొప్పతనాన్ని వారు స్పష్టంగా రాయించి ప్రచారం చేశారు.