బ్యూటీక్లినిక్ పై పోలీసుల దాడి
హైదరాబాద్: అసత్యప్రచారాలతో ప్రజలను మభ్య పెడుతోన్న హైదరాబాద్ లోని ఓ బ్యూటీక్లినిక్ పై శుక్రవారం పోలీసులు దాడి చేశారు. బ్యూటీక్లినిక్ యజమానురాలు మాత్రం పరారీలో ఉన్నారు. మెడికల్ నిబంధనలకు వ్యతిరేకంగా ఎత్తుగాపెంచుతామని, వ్యాయమయం లేకుండానే లావు తగ్గిస్తామని ఎంజెల్స్ క్లినిక్ యజమానురాలు డాక్టర్ రాధికారెడ్డి ప్రకటనలు ఇస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు.
అయితే, ఆమె మాటల్లో నిజం లేదని, ప్రకటనల ద్వారా మోసపోయామని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం ఎసిపి కృష్ణారావు, సిఐ నాగేశ్వరరావు, ఎస్.ఐ ప్రసాద్లతో కూడిన పోలీసు బృందం క్లినిక్ పై దాడి నిర్వహించింది.
పోలీసులు క్లినిక్ చేరుకునేసరికే డాక్టర్ రాధికారెడ్డి తప్పించుకున్నారు. ఆమె కోసం పోలీసులు గాలించినా ఇంతవరకు చిక్కలేదు. ఆమె పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఆచూకీ కోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపుతున్నారు. క్లినిక్ లో పనిచేస్తోన్న సిబ్బందిని పోలీసులువిచారించారు. మొత్తం సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.