అడవుల్లో కూంబింగ్ ఉధృతం
ఏటూరునాగరం: బస్ పేల్చివేత ఘటనతో షాక్ కుగురైన జిల్లా యంత్రాంగం మళ్ళీ కూంబింగ్ ఆపరేషన్లను ముమ్మరం చేసింది. సంఘటన జరిగిన ప్రాంతం మొదలుకొని...చుట్టుపక్కల అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్లను ఉధృతం చేశారు. ఆదివారం నాడు ఐదుగురు నక్సల్స్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేసినందుకు ప్రతీకారంగా వారు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని జిల్లా పోలీసు యంత్రాంగం భావిస్తోంది.
జిల్లా కలెక్టర్ ప్రభాకరరెడ్డి ఆదేశాల మేరకుస్పెషల్ పార్టీ కూంబింగ్ ను నిర్వహిస్తోంది. ఘటన జరిగిన ప్రదేశం నుంచి కొద్ది కిలోమీటర్లు ప్రయాణిస్తే చత్తీస్ ఘడ్ వస్తుంది. కాబట్టి ఆ రాష్ట్రంలోని అడవులకు నక్సల్స్ పారిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు, నక్సల్స్ కు వ్యతిరేకంగా అధికారులు గిరిజనుల్లో ప్రచారం మొదలుపెట్టారు. ఇక్కడి గిరిజనులు ఇప్పటివరకు నక్సల్స్ వైపు సానుభూతి చూపేవారు.
కానీ చనిపోయినవారిలో అధికంగా గిరిజనులే ఉండడంతో ఇప్పుడు వారిలో నక్సల్స్ పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వ్యతిరేకతను మరింతపెంచేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తోంది. బాధిత కుటుంబాలకు సాయం చేస్తూ..వారికి కాపలగా ఉంటూ..ఆ పరిసర ప్రాంతాల్లో గట్టి బందోబస్త్ తో పోలీసులు గిరిజనుల మెప్పుపొందేందుకు ప్రయత్నిస్తున్నారు.