నగరంలో రెడ్ అలర్ట్
హైదరాబాద్ః గురువారం రాత్రిదిల్ సుఖ్ నగర్ సాయిబాబా గుడి వద్ద స్కూటర్ బాంబువిస్ఫోటనం దరిమిలా హైదరాబాద్, రంగారెడ్డిజిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఈ దుర్ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. 18 మంది గాయపడగా అందులో ముగ్గురి పరిస్ధితి ఆందోళనకరంగా ఉంది. ఆలయానికి ఇరవై అడుగుల దూరంలో కొబ్బరి కాయలు కొట్టే స్ధలం వద్ద పార్కు చేసిన స్కూటర్ కు తగిలించిన పాల క్యానులో బాంబు ఉంచి పేల్చినట్టు తెలుస్తోంది.
ఈ స్కూటర్ నిజామాబాద్ జిల్లాలో రిజిస్టరై ఉన్నందున మత ఛాందస ఉగ్రవాది అజం ఘోరీ అనుచరులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారన్న కోణం నుంచి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అజంఘోరీ ముఠా రెండేళ్ళ క్రితం నగరంలో బాంబులు పేల్చి ప్రజల్లో భయోత్పాతం సృష్టించింది. గతంలో ఉగ్రవాదులు, ఫ్యాక్షనిస్టులు బాంబులు పేల్చినప్పటికీ గుడి వద్ద బాంబు పేలడం ఇదే మొదటి సారి. గురువారం నాటి బాంబు పేలుడు సంఘటనతో భయపడిన ప్రజలు రద్దీగా ఉండే దేవాలయాలను సందర్శించడానికి భయపడుతున్నారు. శనివారం పుట్టపర్తి సాయిబాబా జన్మదిన వేడుకల సందర్భంగా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.