నిమ్స్ గొడవపై దర్యాప్తు ప్రారంభం
హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయ నిధిని దుర్వినియోగపరిచాడన్న అభియోగాన్ని ఎదుర్కొంటున్న నిమ్స్ ఆసుపత్రిపి.ఆర్.వో పాండురంగారావుపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేయిస్తున్నట్లు వైద్యశాఖ మంత్రి కోడెల శివప్రసాద్ రావు గురువారం చెప్పారు.
దోషులు ఎంత పెద్దవారైనా వదలమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే పాండురంగారావును విధుల నుంచి సస్పెండ్ చేశారు. అయితే, ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడు. దాదాపు 10 కోట్ల వరకు అక్రమంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పాండురంగారావుస్వాహా చేసినట్లు నిమ్స్ డైరక్టర్ ప్రొఫెషర్ కాకర్ల సుబ్బారావువిలేకరులకు తెలియచేశారు.
ఇదివరకే ఆయనపై పలుసార్లు అభియోగాలు నమోదు అయ్యాయని తెలిపారు. అయితే, సాక్ష్యం చెప్పేందుకు బాధితులు ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల ఆయనపై ఇంతకుముందు చర్య తీసుకోలేదని ఆయన అన్నారు. డైరక్టర్ పై కూడా వచ్చిన అభియోగాలను ప్రస్తావించగాఅందులో నిజం లేదని ఆయన చెప్పారు. పాండురంగారావు అల్లిన కట్టుకథ అదని ఆయన తెలిపారు.