కందకంలో పడి బాలుడి మృతి
విజయవాడ: ఆట ఆ చిన్నారి పాలిట మృత్యువుగా మారింది. కృష్ణా జిల్లా జి.కొండూరు గ్రామానికి చెందిన ఓ బాలుడు కందకంలో పడి మృతి చెందాడు. ఆటలాడుకునేందుకు రోడ్డుమీదికి వెళ్ళిన ఆ బాలుడు పొరపాటున కందకంలో పడి ఊపిరాడక మరణించాడు. ఈవిషాదకర సంఘటన బుధవారం జరిగింది. ఈ గ్రామానికి చెందిన సాయి భవన్ అనే మూడేళ్ళ బాలుడు ఉదయం తొమ్మిదిగంటలకు ఆడుకునేందుకు తన ఇంటి నుంచి రోడ్డుమీదికి వచ్చాడు.
రోడ్డు పనుల కోసం తవ్విన 15 అడుగుల కందకాన్ని పూడ్చకుండా కేవలం సిమెంట్ బస్తాలను మాత్రమే కప్పి ఉంచారు. ఆ కందకంలో పడిన బాలుడిని తీసేందుకు అధికారులు శతథా ప్రయత్నించారు.
లాంకో కొండపల్లి ప్లాంట్ కు చెందిన ఇంజనీర్లు, అధునాతన పరికరాలతో మరో గోతిని తొవ్వి బాలుడికి తొలుత ఊపిరి ఆడేలా చేశారు. గంట పాటు శ్రమించిన అనంతరం బాలుడిని బయటికి తీయగలిగారు. వెంటనే పక్కనే ఉన్న ఆసుపత్రిలో చేర్పించి ప్రథమ చికిత్స చేశారు.ఆక్సిజన్ ఇచ్చి ఊపిరి అందించినా ఆ బాలుడిని కాపాడలేకపోయారు.