రెండు ప్రమాదాలు: 16 మంది మృతి
హైదరాబాద్: రాష్ట్రంలోని సోమవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 16 మంది మరణించారు. కడప జిల్లాల్లో జీపు-ఆర్టీసీ బస్ ఢీకొనడంతో 10 మంది అక్కడిక్కడే మృతి చెందగా, మెదక్ జిల్లా రామాయంపేటలో ఆటో యాక్సిడెంట్ లో ఆరుగురు మరణించారు.
కడపజిల్లా రామాపురం గ్రామ సమీపంలో ఆర్టీసి బస్సును ఒక జీపు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. మరణించినవారందరూ జీపు ప్రయాణికులే. గాయపడినవారిలో ఆరుగురు ఆర్టీసి బస్సు ప్రయాణికులున్నారు. మృత్యువాత పడ్డవారు కడపలో తలపెట్టిన ఒక ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి జీపులో వెళ్తున్నారు. జీపులో 15 మంది ప్రయత్నిస్తుండగా పది మంది మరణించారు. వీరందరూ చక్రాయపేట లక్కిరెడ్డిపల్లెలకు చెందినవారు.మరో 11 మంది గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో జీపు డ్రైవర్ రెడ్డప్పతో పాటు లక్ష్మయ్య, పెదపాక పుల్లయ్య, ప్రకాశ్, నాగరాజు, ఆంజనేయులు, గంగాలయ్య, నాగయ్య, పుల్లయ్య, రాములయ్య మరణించారు.సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థలాన్ని చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
మెదక్ జిల్లా రామాయంపేటలో ప్యాసింజర్ ఆటోను లారీ ఢీకొనగా ఆటోలో ప్రయాణిస్తోన్న ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.