బుధవారం ముసాయిదా బడ్జెట్ విడుదల
హైదరాబాద్: 2003-2004 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ముసాయిదాను ప్రభుత్వం బుధవారం విడుదల చేస్తుంది. ఇందుకు సంబంధించి రంగం పూర్తిగా సిద్దమైంది. రాష్ట్ర బడ్జెట్పై అధికారుల సూచనలను పరిశీలించేందుకు ఒక కమిటీని వేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. బడ్జెట్పై వచ్చిన సూచనలపై చర్చించేందుకు ఆయన మంగళవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రభుత్వ శాఖల అధిపతులతో, కార్యదర్శులతో సమావేశమయ్యారు.
బడ్జెట్ కేటాయింపుల్లోని ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ శాఖల ప్రతిపాదనలను ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు.
ప్రతిపాదనలు లక్ష్యాల సాఫల్య పద్ధతిలో ఉండాలని ఆయన అన్నారు. ఖర్చు చేస్తున్న మేరకు పనులు జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని కూడా ఆయన సూచించారు. ప్రభుత్వ శాఖల స్వయం సమృద్ధిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.