ఘోర ప్రమాదం: 42 మంది మృతి
కోల్ కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రం హౌరా జిల్లాలో మంగళవారం జరిగినఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం 42 మంది మరణించి ఉంటారని భావిస్తున్నారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. 6వ జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తోన్న ఓ లారీ, బస్సు ఢీకొనడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది.
ఒరిస్సాలోని బారిపాద నుంచి వస్తోన్న ఓ టూరిస్ట్ బస్సును, హౌరా నుంచి వస్తోన్న రసాయనాల లారీ ఢీకొంది. ఉదయం పూట దట్టంగా ఉన్న పొగమంచు కూడి ఉండడంతో ఇరు వాహనాల డ్రైవర్లు ఎదురుగా వస్తోన్న వాహనాన్ని గుర్తించలేకపోయారు.
రసాయనాలతో కూడిన లారీని బస్సు ఢీకొనడంతో లారీకి వెంటనే నిప్పుఅంటుకొంది. బస్సుకు మంటలు వ్యాపించడంతో బస్సులో ప్రయాణిస్తోన్న 42 మంది సజీవదహనంఅయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణీకులు శరీరాలు నుజ్జునుజ్జయ్యాయి.
గుర్తుపట్టలేనంత భీకరంగా మృతదేహాలున్నాయని హౌరా జిల్లా ఎస్పీ రాజేష్ కుమార్ తెలిపారు. ప్రమాదం జరిగిన వార్త తెలిసిన వెంటనే స్థానికులు, అధికారులు హుటాహుటాన ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రిలోకి చేర్పించారు.