నమిబీయాపై భారత్ ఘనవిజయం
పీటర్ మారిట్జ్ బర్గ్: ఆదివారం నమిబీయాతో జరిగిన లీగ్ మ్యాచ్ లో భారత్ 181 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పసికూన నమిబీయాపై భారత్ భారీ స్కోర్ సాధించడమే కాకుండా..ఆ జట్టును తక్కువ స్కోర్ కే ఆలౌట్ చేయడం విశేషం.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ సచిన్ టెండూల్కర్, గంగూలీల 244 పరుగుల భాగస్వామ్యంతో 311 పరుగులు చేసింది. ఒపెనర్ వీరెంద్ర సెహ్వాగ్ 24 బంతుల్లో 24 పరుగుల చేసి ఔటయ్యాక, గంగూలీ, సచిన్ లు ధాటిగా ఆడుతూ పరుగులను వరదలెత్తించారు. సచిన్ తొలుత తడపడ్డా..నిలదొక్కుకొన్న తర్వాత బ్యాట్ కు పనిచెప్పాడు.
151 బంతుల్లో 150 పరుగులు చేసి ఔటయ్యాడు. గంగూలీ కూడా సెంచరీ సాధించి, యువరాజ్ సింగ్ తో కలిసి భారత్ కు 311 పరుగుల స్కోర్ ను అందించాడు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన నమిబీయాన జహీర్ ఖాన్ తొలి వికెట్లు తీసుకొని వారి బ్యాటింగ్ ను కుప్పకూల్చాడు.
అనంతరం, హర్భజన్ వికెట్లు తీసుకొనగా, చివర్లో యువరాజ్ సింగ్ ఆరు పరుగులకు నాలుగు వికెట్లు తీసుకోవడం విశేషం. 42.3 ఓవర్లలో నమిబీయా 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. టెండూల్కర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. భారత్ 12 పాయింట్లతో ఆస్ట్రేలియాతో సమంగా ఉంది.