చార్మినార్ బ్యాంక్ ప్యాకేజీ ప్రకటన
హైదరాబాద్: చార్మినార్ కో ఆపరేటివ్ బ్యాంకు పునరుద్దరణ ప్యాకేజీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. డిపాజిట్ దార్లందరికీ తిరిగి చెల్లింపులను మార్చి మూడో తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. లక్ష రూపాయలలోపు డిపాజిట్ దార్లకు మార్చి మూడో తేదీ నుంచి ఏప్రిల్ మూడో తేదీ వరకు అందరికీ సొమ్ము అందచేస్తామన్నారు.
అలాగే లక్ష నుంచి 5 లక్షల రూపాయల డిపాజిట్ దార్ల వడ్డీని పెట్టుబడిగా మార్చి వాయిదాల పద్దతిలో చెల్లిస్తామని చెప్పారు. ఇప్పటివరకు దేశంలో మూసేసిన ఏ బ్యాంకు తిరిగి రివైవల్ ప్యాకేజీ ప్రకటించలేదని, తమ ప్రభుత్వం మాత్రమే చేసిందని బాబు పేర్కొన్నారు.
అప్పులు తీసుకొన్న వారికి కూడా ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. అయితే బకాయిలు చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రభుత్వం ప్యాకేజీపై అన్ని విపక్షాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. అయితే, ప్రభుత్వం దీన్నో గొప్పచర్యగా ప్రకటించుకోవడంపై మజ్లిస్ పార్టీ తప్పుపట్టింది.
బ్యాంకును ప్రభుత్వమే మూసేసింది. దాన్ని పునరుద్దించే బాధ్యత ప్రభుత్వానిదే. ప్యాకేజీ ప్రకటించడం అదోదో త్యాగం లాగా అభివర్ణించడం తప్పు అని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.