విద్యుత్ కొనుగోలుపై గందరగోళం
హైదరాబాద్: ప్రైవేట్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై అధికార, విపక్షాల మధ్య బుధవారం అసెంబ్లీలో తీవ్రవాగ్యుద్దం జరిగింది. ఒక దశలో సీఎల్పీనేత వై.ఎస్ రాజశేఖరరెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులిద్దరే ఆరోపణాస్త్రాలు సంధించుకొంటూ అసెంబ్లీని స్థంభింపచేశారు.
ప్రైవేట్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలన్ని అధికధరకు కుదుర్చుకొన్నాయిని, వీటిని రద్దుచేయాలని వైఎస్ డిమాండ్ చేశారు. ముఖ్యంగా బిపిఎల్ సంస్థతో కుదర్చుకొన్న ఒప్పందాన్ని వెనక్కితీసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలతో రహస్య సంబంధాలను కొనసాగిస్తోందని ఆయన ఆరోపించారు.
దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందిస్తూ..కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ప్రైవేట్ విద్యుత్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, వాటిని రద్దు చేసి చూపించండి అప్పుడు ఆలోచిద్దామని అన్నారు.
విద్యుత్ ఒప్పందాలపై కేంద్రం చట్టం చేసేంతవరకు ఇక్కడి వాటిని రద్దు చేయాలన్న వైఎస్ సూచన అర్థరహితమన్నారు. ఆ చట్టం వచ్చేంతవరకు ఆగాలంటే ఇక్కడ ప్రజలు చీకట్లో ఉండాల్సిందేనన్నారు.