అయోధ్యపై విపక్షాల చెడుగుడు
న్యూఢిల్లీ: అయోధ్య అంశంపై కేంద్రప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరిని విపక్షాలు ఎండగట్టాయి. లోక్ సభలో గురువారం రాత్రి వరకు సాగిన చర్చలో విపక్షాలు ప్రభుత్వం తీవ్రవిమర్శలు చేశాయి. చర్చను ప్రారంభించిన ఎస్పీ నేత ములాయంసింగ్ యాదవ్ - అయోధ్య అంశంపై ప్రభుత్వం కోర్టుకు వెళ్ళి లేనిపోని వివాదాన్ని లేవనెత్తిందని ఘాటుగా విమర్శించారు.
ప్రభుత్వానికి తీర్పుపై అంత తొందర ఉన్నప్పుడు, మరి బాబ్రీమసీదు కూల్చివేత విషయంలో తాత్సారం ఎందుకు చేసింది? ప్రభుత్వానికి చెందిన కొందరు సీనియర్ మంత్రులు ఈ కేసులో ఇరుక్కున్నందునా అని ఆయన ప్రశ్నించారు.
ములాయం విశ్వహిందూ పరిషత్ పై కూడా మండిపడ్డారు. వీఎచ్ పీ రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తోందన్నారు. వీఎచ్ పిని ఆయన బిజెపికి చెందిన సాధువుల శాఖగా అభివర్ణించారు. రెచ్చగొట్టే రీతిలో ప్రవర్తిస్తోన్న పరిషత్ సాధువుల ను జైల్లో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.